ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా KK-5 గనిలో నిన్న రాత్రి రెండవ షిఫ్ట్ సమయంలో చోటు చేసుకున్న భూకుళ్ల కారణంగా యాక్టింగ్ ఎస్డీయెల్ కార్మికుడు రాసపెల్లి శ్రావణ్ కుమార్ (27) మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని మృతి చెందిన శ్రావణ్ కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రావణ్ కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మాటను మంత్రి హామీ ఇచ్చారు.మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు, సింగరేణి సంస్థ నుంచి లభించే అన్ని ప్రయోజనాలు పూర్తిగా అందేలా చూస్తాం” అని మంత్రి తెలిపారు.కాగా మంత్రి వివేక్ వెంకటస్వామి KK-5 గనిలోకి స్వయంగా వెళ్లి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న అంశాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి జీఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికుల రక్షణతో కూడిన ఉత్పత్తి జరగాలని, ప్రాణాలు కాపాడటమే మొదటి లక్ష్యంగా అధికారులు పని చేయాలి. లాభాలకంటే కార్మికుల ప్రాణాలే మిన్న” అని మంత్రి స్పష్టం చేశారు.గని బయట కార్మికులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హామీ ఇచ్చిన మంత్రి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఈ ఘటనపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది పరిశీలనీయమవుతోంది. కార్మిక సంఘాలు, శ్రామికుల రక్షణపై పునరాలోచన జరిగే అవకాశం కనిపిస్తోంది.
Admin
Aakanksha News