ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : తమిళనాడులోని కడలూరు జిల్లాలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెమ్మగుంపం వద్ద ఉన్న అన్మాన్డ్ రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్ను వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో వ్యాన్ సుమారు 10 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మిగతా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో నలుగురు విద్యార్థులతో పాటు డ్రైవర్, అసిస్టెంట్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.అదేవేళ రైలు వచ్చే సమయంలో గేట్ వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీకొట్టిన ధాటికి వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. సంఘటనపై రైల్వే శాఖ విచారణ ప్రారంభించింది.
Admin
Aakanksha News