ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సుబ్బంపేట పంచాయతీ పరిధిలో వన్యప్రాణి నక్కను ఇసుక లారీ ఢీకొని మృతి చెంది పెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున బి ఎస్ రామయ్య నగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ ఢీకొనడంతో నక్క శరీరం పూర్తిగా నశించిపోయింది. ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది. సుబ్బంపేట పంచాయతీ పరిధిలో విచ్చలవిడిగా ఇసుక ర్యాంపులు ఉండటంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో ఇసుక లారీలు రై రై అంటూ ఊచకోతలా దూసుకుపోతున్నాయి. ఇవి పాదచారులకు, వాహనదారులకు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. లారీల వేగవంతమైన పరుగులతో రోడ్డుమీద దుమ్ము మబ్బులు కమ్ముకుంటుండటంతో వాహనదారులు, చిన్న చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారం చేస్తున్న వ్యాపారదారులు లారీల వల్ల వచ్చే ధూళిదూది కారణంగా తమ వ్యాపారాలు నష్టాల్లో మునిగి పోయాయని వాపోతున్నారు. పక్కనే ఉన్న స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు కూడా ఈ లారీ రాకపోకలతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇసుక లారీల వేగాన్ని నియంత్రించకుండా అధికారులు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖలు జోక్యం చేసుకుని ఇసుక ర్యాంపులను కట్టడి చేసి, లారీ రాకపోకలపై నియంత్రణ తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
Admin
Aakanksha News