ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సూర్యాపేట జిల్లా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట పట్టణంలో కలకలం రేపింది.పట్టణంలోని డీమార్ట్ పక్క సందులో వివాహిత శవమై వేలాడుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మృతురాలికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం కాగా, భర్త రెండు సంవత్సరాలుగా కెనడాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల సూర్యాపేటకు వచ్చిన భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, భర్త వేధింపుల కారణంగానే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఘటనపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్తతో పాటు ఇతరుల పాత్రపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి.
Admin
Aakanksha News