ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : కొత్త సంవత్సరం ప్రవేశానికి ముందు కుటుంబ వివాదంపై తన నలుగురు చెల్లెళ్లతో పాటు తల్లిని హత్య చేసినట్లుగా భావిస్తున్న అర్షద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల వ్యక్తి మంగళవారం కుటుంబ వివాదంపై తన తల్లికి, నలుగురు చెల్లెళ్లకు మద్యం తాగించిన ఆహారంలో విషం కలిపి లక్నోలోని ఒక హోటల్లో వారిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు అర్షద్ను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఆ ఐదుగురు తమ మణికట్లపై కోత గాయాలతో విగతజీవులుగా కనిపించారు. వారి ఉన్ని దుస్తులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. అర్షద్ వారి ఆహారంలో విషపదార్థాలు కలిపి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నేరానికి పాల్పడిన తరువాత తన సొంత వీడియోను రికార్డు చేస్తూ, తమ పొరుగువారు ఆగ్రాలోని తమ ఆస్తిపై కన్నువేశారని, తన చెల్లెళ్లను హైదరాబాద్లో విక్రయించాలని ప్లాన్ వేశారని ఆరోపించాడు.తన కుటుంబం గతి గురించి భయపడి తాను పరాయి వ్యక్తుల వల్ల హాని కలగకుండా చూసేందుకు తల్లిని, చెల్లెళ్లను హత్య చేశానని అర్షద్ చెప్పాడు. ఈ హత్య కేసులో ఒక అనుమానితునిగా అర్షద్ తండ్రి బాదర్ను కూడా పోలీసులు పేర్కొన్నారు. తండ్రి ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అర్షద్, అతని తండ్రి ఈ ఘటనకు ముందు మద్యం సేవించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. అర్షద్ తన తల్లికి, చెల్లెళ్లకు కూడా మద్యం ఇచ్చాడని లక్నో పోలీస్ కమిషనర్ రవీనా త్యాగి తెలియజేశారు. ఆగ్రాకు చెందిన ఆ కుటుంబం డిసెంబర్ 30 నుంచి లక్నోలోని హోటల్లో బస చేస్తోంది, ‘మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం పంపాం. తీవ్ర స్థాయిలో సాగిన వాగ్వాదం హత్యలకు దారి తీసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తు పూర్తి అయిన తరువాత హంతకుని ఉద్దేశం గురించి మరింత సమాచారం అందజేస్తాం’ అని త్యాగి విలేకరులతో చెప్పారు.
Admin
Aakanksha News