ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2019లో మతిస్థిమితం సరిగాని బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఘటన గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.2019 ఫిబ్రవరి 11న శివాజినగర్కు చెందిన బాధితురాలికి కడుపునొప్పి రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లగా, సిటీ స్కానింగ్లో ఆమె 15 వారాల 4 రోజుల గర్భవతిగా తేలింది. విచారణలో బాధితురాలిపై అదే ప్రాంతానికి చెందిన ఆకుల గట్టయ్య (వయసు 58) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. నిందితుడి భార్య విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీసులు IPC సెక్షన్ 376 2(l)(n) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అప్పటి ఇన్స్పెక్టర్ పర్స రమేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కోర్టులో దాఖలయ్యింది.తాజాగా గోదావరిఖని అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి టి. శ్రీనివాస్ రావు నేరం రుజువైన నేపథ్యంలో నిందితుడు ఆకుల గట్టయ్యకు 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 2,000 జరిమానా విధించారు.ఈ కేసు విచారణలో కోర్టు లైజన్ అధికారిగా హెడ్ కానిస్టేబుల్ కొత్తకొండ శంకర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జ్యోతి రెడ్డి, ఏ. రాములు కీలకపాత్ర పోషించారు. కేసు విజయవంతంగా ముగియడంలో వారి కృషిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ అభినందించారు.
Admin
Aakanksha News