ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే నని పరోక్షంగా విమర్శించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు చేపట్టిన షర్మిల తొలి ప్రసంగంలోనే అధికార వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.దోచుకో..దాచుకో లాంటి షర్మిల వ్యాఖ్యలు వైసీపీ నాయకుల్లో ఆగ్రహం తెప్పించాయి. 15 రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన వరకు కూడా వైఎస్ జగన్ షర్మిల గురించి ఎక్కడా కూడా ఆరోపణలు చేయలేదు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకం కింద నిధులను విడుదల చేసి బహిరంగ సభలో మాట్లాడుతూ షర్మిలపై మాట్లాడారు.చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, వారంతా పక్క రాష్ట్రంలోనే ఉంటారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తేనని పరోక్షంగా వ్యాఖ్యనించారు. చంద్రబాబు వదిన కూడా బాబు క్యాంపెయినర్లలో ఆమె ఒకరని దగ్గుబాటి పురందేశ్వరిపై ఆరోపణలు చేశారు.
Admin
Aakanksha News