ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ అధినేత వక్రీకరిస్తున్నారని ఏపీ మంత్రి పయ్యావుల కేశవులు ఆరోపించారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్మీట్ పెట్టి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కోర్టు చంద్రబాబు కు మొట్టికాయలు వేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కారణాలకు కోర్టు వేదిక కాదనే ధర్మాసనం చెప్పిందని గుర్తు చేశారు.స్వతంత్ర దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి వస్తాయనే మాట కూడా జగన్ చెప్పలేదని అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా , నిష్పక్షపాతంగా సహకరిస్తామని వెల్లడించారు. తిరుమలలో నిజాలు బయటకు రావాలనే నిజాయితీగా కోరుకుంటున్నామని అన్నారు. దోషులు ఎవరనేది విచారణలో తేలుతుందని వెల్లడించారు.చంద్రబాబు వేంకటేశ్వరస్వామి విషయంలో నిజాలు తప్ప అబద్దాలు చెప్పరనే నమ్మకంతో ప్రజలు లడ్డూకల్తీ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు. లడ్డూ అంశం పార్టీ అంతర్గత విషయంలో మాట్లాడారని, మీడియా సమావేశంలో కాదని చెప్పారు.
Admin
Aakanksha News