ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ సీఎం జగన్ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనను అపోజిషన్ లీడర్గా గుర్తించేలా స్పీకర్ కు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు నిర్ణయం ఇంతవరకూ వెలువడలేదు. ఈ నేపథ్యంలో జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదాపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.హైకోర్టు స్పీకర్కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని.. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నాను అన్నారు. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామన్న విషయాన్ని జగన్ గమనించాలన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ‘ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది.అభియోగాలు, బెదిరింపులతో జూన్లో జగన్ నాకు లేఖ రాశారు. లోక్సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదు.నాడు లోక్సభలో టీడీపీ గ్రూపు నేత నాయకుడిగా మాత్రమే గుర్తించారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపైన వైసీపీ అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో ఉంది. అసత్య ప్రచారాలతో స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. జగన్ ఇప్పటివరకూ చేసిన అసత్య ప్రచారాన్ని సంధి ప్రేలాపనగా పరిగణించి క్షమిస్తున్నా’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
Admin
Aakanksha News