ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : హక్కుల దన్నుతోనే ఆత్మగౌరవం నెలకొంటుందని, ప్రజల స్వేచ్ఛకు ఊపిరి మానవ హక్కులే దన్నుగా నిలుస్తున్నాయని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్.ఆర్.పి.సి.ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బి.ఆర్.సి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్, జాతీయ కాపు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగరాల రవిచంద్రన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పిఠాపురంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా బొంగరాల రవి చంద్రన్ అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం తీర్మానం చేసినట్లు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, స్వీయ భద్రత, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుగా ఉంటాయని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. మానవ హక్కులను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్నారు. భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, దళితులపై దాడులు జరగకుండా అడ్డుకున్నప్పుడే మానవ హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, సమాజంలో జీవించే హక్కులే మానవ హక్కులని తెలిపారు. ఈ హక్కులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న పేద, బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని, రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. అనంతరం విద్యాహక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులపై అవగాహన కలిపించారు.
Admin
Aakanksha News