Friday, 17 April 2026 01:42:36 PM

మానవ మేధస్సుకు పదును పెట్టే మహోన్నతమైన అంశం అవధానం...

- పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Date : 15 December 2024 03:31 PM Views : 330

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : మానవ మేధస్సుకు పదును పెట్టే మహోన్నతమైన అంశం అవధాన ప్రక్రియ అని, నేటి సమాజంలో అవధాన ప్రక్రియ లోపించడం వలన జడత్వం పెరిగి మానవుల్లో యుద్ధ కాంక్ష పేరుకు పోతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని శనివారం రాత్రి పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి ఉమర్ అలీషా అధ్యక్షతన శ్రీమద్భగవద్గీత అష్టావధానం, మరియు కవి పండితులకు సత్కారం సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ భగవత్ తాత్వాన్ని మానవాళికి అందించే మహోన్నత కార్యక్రమం అవధాన ప్రక్రియ అని పేర్కొన్నారు. జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి అద్భుతమైన మార్గ దర్శనం భగవద్గీతలో ప్రసాదించబడిందని వెల్లడించారు. యుద్దాలను నివారించడానికి భగవద్గీత సందేశం మానవాళికి ఎంతో అవసరమని సూచించారు. అవధాన కార్యక్రమాలు సమాజంలో విస్తరిస్తే మానవత్వం పరిఢవిల్లి మానవుడు మానవుడిగా మానవత్వపు విలువలతో మనుగడ సాగించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అతి చిన్న వయసులో గీతావధానిగా గుర్తింపు తెచ్చుకున్న అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావును అభినందించారు. తదుపరి గురుసహస్రావధాని డాక్టర్ కరిమెళ్ల వరప్రసాద్ సంచాలకులుగా తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయానికి చెందిన అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు అవధానిగా జరిగిన భగవద్గీత అష్టావధాన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా భగవద్గీత నందలి అనేక అధ్యాయాల్లోని విషయాలను ప్రస్థావించి వాటిని విశ్లేషిస్తూ పృచ్చకుల ప్రశ్నలకు అవధాని సమాధానాలను అందించిన తీరు సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ నాట్యాచార్యులు డా. సప్పా దుర్గాప్రసాద్ నేతృత్వంలో నటరాజ నృత్యనికేతన్ కు చెందిన నాట్య బృందం చేసిన ఆగమ శాస్త్ర ఆలయ నృత్య ప్రదర్శన వీక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. అవధానం అనంతరం పృచ్చకులుగా వ్యవహరించిన లింగాల యాజ్ఞవల్క్య శర్మ, జోశ్యుల కృష్ణబాబు, అష్టావధాని కాకరపర్తి దుర్గాప్రసాద్, మార్ని జానకిరామ చౌదరి, దాయన సురేష్ చంద్రజీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ (శిరీష కవి), సూరంపూడి వేంకట రమణ మరియు నాట్యాచార్యులు డా. సప్పా దుర్గాప్రసాద్ మరియు వారి బృంద సభ్యులను పీఠాధిపతి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కవి పండితులకు సత్కార కార్యక్రమంలో భాగంగా సుమారు నాలుగు వందలమంది కవులను ఉమర్ ఆలీషా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్.టి.వి. ప్రసాదవర్మ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :