ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో దోచుకునేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ ఆధర్యంలో అరకులో నిర్వహించిన ‘ రా..కదిలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ జీవో నంబర్ 3 ను ఎందుకు రద్దు చేశారని ఆరోపించారు.గిరిజనప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జీవో 3ను తీసుకొస్తే దానిని రద్దు చేయడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. . టీడీపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 3ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో తాము గిరిజనుల కోసం 16 పథకాలు ప్రత్యేకంగా ప్రవేశపెట్టామని , వాటిని వైసీపీ రద్దు చేసిందని విమర్శించారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నిరద్దు చేశారని ఆరోపించారు.గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగనని మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా అని నిలదీశారు. ఎన్నో కాఫీలు ఉన్నా, అరకు కాఫీ కి ప్రత్యేకత ఉందని, భవిష్యత్లో అరకు కాఫీ ని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్తామన్నారు. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని పరిచయం చేస్తోందని ఆరోపించారు.
Admin
Aakanksha News