ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కొనియాడారు. నాగర్కర్నూల్ జిల్లాలోని గంగారం పెద్ద తండాలో సంత్ సేవాలాల్, మెరమ్మయాడి నూతన ఆలయాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా, లంబాడాల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకుడు అని ప్రశంసించారు. అడవి బిడ్డలైన బంజారా జాతి ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక–సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి రక్షించేందుకు ఆయన జీవితాంతం పోరాటం సాగించారని పేర్కొన్నారు.సంత్ సేవాలాల్ మహారాజ్ క్రమశిక్షణ గల బాలజ్ఞానిగా, బంజారా జాతి కులదైవంగా భావించే సాత్ భవానీ దేవతల్లో ఒకరైన మెరమ్మయాడిపై అపార భక్తి కలిగినవాడిగా, పశువులను కాసే ఓ సాధారణ లంబాడీ తల్లి బిడ్డగా ఎదిగాడని ఎమ్మెల్యే వివరించారు. 18వ శతాబ్దంలో సంభవించిన కరువు సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బంజారా జాతికి ధైర్యం, భరోసా ఇచ్చి భవిష్యత్తుకు బాటలు వేసిన మహానుభావుడని కొనియాడారు. బంజారా జాతిలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.లంబాడా వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గంగారం పెద్ద తండా సర్పంచ్ రాత్లావత్ గోపాల్ నాయక్, రాష్ట్ర నాయకులు సుహాసన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మిద్దె రాములు, గిరిజన నాయకులు మాన్య నాయక్, గోవింద్ నాయక్, రామచందర్, పాండు, గోపాల్, హరీష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పీ హాలియా, మల్లేష్, రవి, చంద్రు, దేవుల, బద్య, దీప్లా తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News