ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్రమ కేసుల విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు దండోల సామెల్ మాట్లాడుతూ, రాజకీయ ప్రతీకారంతోనే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ విపక్షాలపై అక్రమ చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని, ఆడపడుచులకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ బూస్నెల్లి కిషన్ మల్కయ్య, కరచాకలి మల్లేశం, మెతుకు మల్లేశం, ఎర్ర చాకలి మల్లేశం, గణేష్, విట్టల్, యాకోబ్ తదితర బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు..
Admin
Aakanksha News