ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామంలో ఓ చిన్న వాడ ప్రజలు తమ సమస్యపై వినూత్నంగా నిరసన తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఏ రాజకీయ పార్టీ అభ్యర్థులైనా తమ వాడకు ఓట్ల కోసం రాకూడదంటూ పెద్ద ప్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసి సంచలనంగా మారారు. గ్రామస్థుల ఆవేదన ప్రకారం, గత 30 సంవత్సరాలుగా వాడలో సరైన విద్యుత్ సౌకర్యం లేదని వాపోతున్నారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ తీగలు లేవని, వీధిదీపాలు లేక రాత్రివేళ ఇంటి బయటకు రావడం భయంకరమని చెబుతున్నారు. ఇంటింటికి మీటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ, “మీరు చలానా కట్టి, మీరే తీగలు కొనుక్కోవాలి” అని సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మాకు ఆ ఖర్చు చేసే స్థోమత లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి హామీలు ఇవ్వడం మాకు అవసరం లేదు. ఎవరైతే మాకు నిజంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తారో, వారికే ఓటు వేస్తాం. లేనిపక్షంలో ఎవరూ వాడలోకి రాకూడదని వారు హెచ్చరిస్తున్నారు.ఈ వినూత్న నిరసనతో రామారావుపల్లె వాడ పేరు ఇప్పుడు మొత్తం మండలంలో చర్చనీయాంశమైంది. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Admin
Aakanksha News