ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జగిత్యాల జిల్లా : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా మారింది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన శ్రీ చైతన్య హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న షోయబ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల మెదక్ జిల్లాలో నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో షోయబ్ ప్రతిభావంతమైన ఆటతీరుతో ఆకట్టుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హరియాణా రాష్ట్రం జజ్జార్లోని సంస్కారం యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున షోయబ్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ క్యాతం గంగారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రమశిక్షణతో కూడిన ఆటతీరు, పట్టుదల, జట్టు స్పూర్తితో షోయబ్ రాణించాడని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా షోయబ్ తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
Admin
Aakanksha News