ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మంజీరా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో నది కరకట్టలు దాటేలా ప్రవహిస్తోంది. శుక్రవారం ఘనపూర్ ఆనకట్టపై నుంచి నింజాంసాగర్ వైపు 88వేల పైచిలుకు క్యూసెక్కుల వరద పరుగులు తీయడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.వరద ఉధృతి కారణంగా ప్రసిద్ధ ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో, భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్సవ విగ్రహాన్ని ఆలయ రాజగోపురంలో ఉంచి, అక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అధికారుల సమాచారం మేరకు ప్రాజెక్టుల వద్ద నీటి మట్టాలు పెరగడం వల్ల ఇంకా మరికొన్ని రోజులు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. పక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.మంజీరా నదిలో ఉధృతంగా సాగుతున్న వరదతో పంట పొలాలు, తక్కువ భూములు మునిగిపోతున్నాయి. రహదారి రవాణా కొంతమేర దెబ్బతింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Admin
Aakanksha News