ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నిజామాబాద్ జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధికారంలో వాటా రావాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీ, ఎస్టీ మంత్రులు లేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆమె తీవ్రంగా విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీలో తాను తిరుగుబాటు చేయలేదని, కొందరి మోసపూరిత చర్యల వల్లనే పార్టీకి నష్టం జరిగిందని స్పష్టం చేశారు. నన్ను ఎమ్మెల్యేలే ఓడించారు. నన్ను పార్టీ నుండి తొలగించే అవసరం కేసీఆర్ కి లేదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. "ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వక విద్యను అందనంత దూరం చేశారు. ఆడపిల్లల విద్యను సీఎం రేవంత్ రెడ్డి అణిచివేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 నియామకాలలో నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం అని పేర్కొని, దీనిపై సుప్రీంకోర్టుకు రిట్ వేస్తానని హెచ్చరించారు.రైతుల సమస్యలపై కూడా స్పందించిన ఆమె, వరి, మక్కా పంటలకు న్యాయమైన బోనస్ చెల్లించాలన్నారు. వరద ముంపు ప్రాంతాల రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పార్టీ కన్నా ప్రజల సమస్యలు ముఖ్యం. అవసరమైతే కొత్త పార్టీ పెడతాం. బీఆర్ఎస్ లేదా కేసీఆర్ గారిని ఇష్యూ ఆధారంగా మాత్రమే విమర్శిస్తానని కవిత స్పష్టం చేశారు.
Admin
Aakanksha News