ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను పోలీసులు తనిఖీ చేయగా మొత్తం 92 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం ఈ గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోలాపూర్కు చెందిన సచిన్ గంగారాం, మహేశ్, విజయ్లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 92 కిలోల గంజాయితో పాటు రూ.11 వేల నగదు, హ్యుందాయి కారు, డీసీఎం వాహనం, ఐదు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా, నెట్వర్క్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Admin
Aakanksha News