ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / యాదాద్రి భువనగిరి జిల్లా : దేవస్థానం అభివృద్ధికి ,భక్తుల సేవలకు జీవితాంతం పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులు ఏర్పాటు చేసుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పెన్షనర్ల సంఘ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయిస్తానని ఆలేరు ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు ,సోమవారం యాదగిరిగుట్టలో జరిగిన పెన్షనర్స్ డే 28వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సమావేశానికి సంఘం కార్య నిర్వాహక అధ్యక్షుడు ఊడెపు నరసింహారావు అధ్యక్షత వహించారు. తమ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సంఘ ప్రధాన కార్యదర్శి కొక్కొండ యాదగిరి తదితరులు సమర్పించిన విజ్ఞాపన పత్రానికి ప్రభుత్వ విప్ ఐలయ్య సానుకూలంగా స్పందించారు. తగు స్థలంతో పాటు హెల్త్ కార్డులు ,అలాగే ఇతర సమస్యల గురించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సంఘం ఏర్పడి 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 65 నుండి 85 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న సభ్యులకు ఘన సన్మానం చేశారు .దాదాపు 180మంది పాల్గొనగా 43 మందిని సన్మానించారు.
Admin
Aakanksha News