ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) దౌలూరి శుభ కామేశ్వరి దేవిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందుకు పది వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు ట్రాప్ నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో కారేపల్లిలోని ఆమె నివాసం వద్దనే ఆర్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆర్ఐ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు లేదా నగదు లభ్యమయ్యాయా అనే అంశంపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. గతంలో కూడా ఆర్ఐ శుభ కామేశ్వరి దేవిపై లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కారేపల్లి మండలంలో కలకలం రేగింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Admin
Aakanksha News