ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి 250 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మనకోండూర్లో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. మనకోండూర్ నుంచి వరంగల్ రోడ్డులో ఉన్న మనకోండూర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన, తమిళ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఈ ధర్నా చేపట్టారు.తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులకు తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం అన్యాయమని, తెలంగాణ ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. హామీ అమలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టంగా ప్రకటించారు.ధర్నాలో భాగంగా ప్రభుత్వ భూమిలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇది ఉద్యమకారుల హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి సంకేతమని నేతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి మూలమైన ఉద్యమకారులను విస్మరించడం తగదని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం న్యాయమైన హక్కు అని తెలంగాణ జాగృతి నినదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలతో ప్రాంగణం మార్మోగగా, ఉద్యమకారుల హక్కుల కోసం ఏకతాటిపై నిలబడి పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
Admin
Aakanksha News