ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : ఉమ్మడి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ శివారులోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ కనీవినీ ఎరుగని విధంగా కనిపించింది. ఆదివారం ఉదయం నుంచే వివిధ జిల్లాలు,గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీశారు.మంజీరా నది ఏడుపాయల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందనే బలమైన నమ్మకంతో భక్తులు తెల్లవారుజామునే నదీ తీరానికి చేరుకుని స్నానాలు చేశారు. అనంతరం వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు.భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా వనదుర్గా మాత నామస్మరణతో మార్మోగింది.సర్వదర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏడుపాయల ఎండోమెంట్ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 200కు పైగా పోలీసులు విధులు నిర్వహించారు.ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గా మాతను దర్శించుకున్నారు. మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా ఏడుపాయల ఆలయం భక్తి పరవశంతో ప్రత్యేక శోభను సంతరించుకుంది.
Admin
Aakanksha News