ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగ్సన్పల్లి గ్రామ శివారులో వెలసిన ప్రసిద్ధ వన దుర్గ అమ్మవారి ఏడుపాయల ఆలయం వరద ముంపులో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టు నుండి భారీగా నీరు వదిలి వేయడంతో సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆలయ రాజగోపురం వరకు నీరు చేరి భక్తులకు భిన్నమైన దృశ్యాన్ని అందిస్తోంది. జలదిగ్బంధంలో ఉన్నప్పటికీ ఆలయ ఉత్సాహ విగ్రహానికి వేదపండితులు సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసేందుకు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట సహా వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.భక్తుల రాకపోకల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.ఏడుపాయల ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ... "పోలీసుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వరద ప్రభావం మధ్య కూడా అమ్మవారి దర్శనం నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.జలప్రవాహం మధ్య వెలుగొందుతున్న అమ్మవారి ఆలయం భక్తులకు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఒక విభిన్న అనుభూతిని కలిగిస్తోంది.
Admin
Aakanksha News