ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / వరంగల్ జిల్లా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ 21న బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, సిటీ డీసీపీ సలీమా, ఏసీపీ నరసింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ మచ్చ శివకుమార్, ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ సీఏ అజిత్, దేవాలయ ఈవో డి.అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేందర్శర్మ, టూరిజం శాఖ అధికారి శివాజీ తదితరులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయానికి తరలివచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తూర్పు గేటు వద్ద బ్యార్గేట్స్ ఏర్పాటు చేసి, వీఐపీలను, మంత్రులను ఆ ద్వారానికే అనుమతించాలని ఆదేశించారు. దర్శనం అనంతరం వీఐపీలను స్టేజీపైకి స్వాగతించాల్సిందిగా సూచించారు. వీఐపీలు ప్రత్యేకంగా బతుకమ్మ ఆడేందుకు పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేయాలని సూచించారు.దేవాలయ ప్రాంతమంతా విద్యుత్ అలంకరణ ఉండేలా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మైక్ సెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను నియమించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని, 22వ తేదీ ఉదయం 7 గంటలకల్లా బతుకమ్మ పువ్వులు తొలగించి శుభ్రత పాటించాలన్నారు.మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మాస శివరాత్రి పురస్కరించుకొని రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేందర్శర్మ తెలిపారు.
Admin
Aakanksha News