ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హన్మకొండ జిల్లా : పంచాయతీ ఎన్నికల రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే తొలి విడత ప్రచారం పూర్తవగా, రెండో–మూడో విడత ప్రచారం ఊపందుకున్న తరుణంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్డుకున్నారనే ఆరోపణలతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాలలో ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని కార్యకర్తలు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ పరిణామంపై హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కడియం సారూ… మనది ఏ పార్టీ..? కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి..?’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. స్థానిక ప్రజలకు తమ అభ్యర్థుల ప్రచారం సాగనివ్వకుండా అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్లో భాగంగా ప్రతి పార్టీకి సమాన అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రచారంపై అడ్డంకుల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎన్నికల వేడి ఇంకా పెరిగినట్లే కనిపిస్తోంది.
Admin
Aakanksha News