ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్కర్నూల్ నియోజకవర్గ గిరిజన లంబాడీ ప్రజల దశాబ్దాల కల నేడు సాకారమైంది. బిజినపల్లి మండల కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం బిజినపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ… గత పాలకులు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించలేదని విమర్శించారు. కానీ ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గౌరవ ఎమ్మెల్యే, పేదల పెన్నిధిగా పేరుగాంచిన రాజేష్ రెడ్డి కృషితో గిరిజనుల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో గిరిజనుల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బిజినపల్లి మండల కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ గుడి నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు.ఈ నిధుల మంజూరు గిరిజన సమాజానికి చారిత్రక ఘట్టమని, ఇది తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నాయకులు అన్నారు. సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణంతో గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవసరాలు తీరుతాయని, భవిష్యత్తు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజనుల తరఫున ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన లంబాడీ సర్పంచులు కేతావత్ సరోజ, మాన్య నాయక్, మునీందర్ నాయక్, మూడవత్ గోపాల్ నాయక్, గోరి భాయి, రాట్లవత్ గోపాల్ నాయక్, కృష్ణ నాయక్, కాట్రావత్ బుజ్జి, చందు లాల్ నాయక్, కేతావత్ లలిత భాయి, రాట్లవత్ విజయ, దిప్ల నాయక్, ఇస్లావత్ పూల్య నాయక్, రామచంద్ర నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యతో పాటు ముఖ్య నాయకులు మూడవత్ గోవింద్ నాయక్, మూడవత్ హన్మ్య నాయక్, ఆంగోత్ లక్ష్మణ్ నాయక్, వి. పాండు నాయక్, బదావత్ పాండు నాయక్, పట్లవాట్ పాండు నాయక్, పట్లవాట్ రాజు నాయక్, దేవుల నాయక్, డెగావత్ రవి నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News