ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : ఇటీవల మరణించిన ప్రముఖ మానసిక నిపుణుడు, ఇంద్రజాలికుడు, ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస శిక్షకుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మరణార్థంగా "పట్టాభి జీవితోత్సవం" పేరిట శుక్రవారం హైదరాబాదులోని సత్యసాయి నిగమాగమంలో వేడుకగా సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖ ఇంద్రజాలికులు, శిక్షకులు, పట్టాభిరామ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా ఖమ్మం జిల్లాకి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు మేజిక్ రాజా, హరి పాల్గొన్నారు. వారు డాక్టర్ పట్టాభిరామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం పట్టాభిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మనో వైజ్ఞానిక ప్రసంగాలు, జీవిత దృక్పథాన్ని ప్రజలలో విస్తృతంగా వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. విద్యార్థులు, యువతలో నైపుణ్యాభివృద్ధికి పట్టాభిరామ్ చూపిన మార్గదర్శకతను కొనియాడారు.ఈ సందర్భంగా మేజిక్ రాజా మాట్లాడుతూ... డాక్టర్ పట్టాభిరామ్ ఇంద్రజాలాన్ని కేవలం వినోదంగా కాకుండా, ఒక శాస్త్రపరమైన విద్యగా తీర్చిదిద్దారు. ప్రజలలో మానసిక ధైర్యాన్ని పెంపొందించే విధంగా తన ప్రదర్శనలతో ఎన్నో జీవితాలను మలిచారు. ఆయన మృతి మనకందరికీ తీరని లోటు." అని భావోద్వేగంగా అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఇతర ప్రముఖ ఇంద్రజాలికులు మల్లేశం, యతిరాజ్, ఎంఏ కరీం, పూర్ణచందర్, బాంబుల శీనన్న తదితరులు పాల్గొన్నారు. వారు కూడా తమ జ్ఞాపకాలను పంచుకుంటూ పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలపై ఆయన చేసిన కృషిని ప్రస్తావించారు. సభ ముగింపులో అందరూ ఒక్కసారిగా నిలబడి మౌన ప్రార్థన నిర్వహించి, పట్టాభిరామ్ గారి స్మృతికి నివాళులర్పించారు. సభ పూర్తిగా భావోద్వేగభరితంగా సాగింది.
Admin
Aakanksha News