Saturday, 08 August 2026 07:17:54 AM

టెస్లా, స్పేస్ ఎక్స్ సిఇఒ ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోడీ టెలిఫోన్ సంభాషణ...

టెక్నాలజీ, సృజన రంగాల్లో సహకారానికి గల అవకాశాలను మేము చర్చించాం: మోడీ

Date : 18 April 2025 07:00 PM Views : 771

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సిఇఒ ఎలాన్ మస్క్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. టెక్నాలజీ, సృజన రంగాల్లో భారత్, అమెరికా మధ్య సహకారం పటిష్ఠతలో పరస్పర ఆసక్తిని ఉభయులూ పునరుద్ఘాటించారు. భారతీయ విద్యుత్ వాహన విపణిలో ప్రవేశానికి టెస్లా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు భావిస్తున్న సమయంలో ఉభయుల మధ్య టెలిఫోన్ సంభాషణ చోటు చేసుకున్నది. ఈ సంవత్సరం మొదట్లో వాషింగ్టన్ డిసిలో తమ గత సమావేశం నేపథ్యంలో ఉభయులూ విస్తృత శ్రేణి అంశాలపై చర్చించారు. తాము వివిధ అంశాలపై చర్చించినట్లు మస్క్‌తో సంభాషణ అనంతరం ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్ డిసిలో మా భేటీలో ప్రస్తావించిన విషయాలు సహా వివిధ అంశాల గురించి చర్చించాను.టెక్నాలజీ, సృజన రంగాల్లో సహకారానికి గల అపార అవకాశాలను మేము చర్చించాం’ అని ఆయన తెలిపారు. ‘ఆ రంగాల్లో యుఎస్‌తో మా భాగస్వామ్యాలను ముందుకు తీసుకుపోవడానికి భారత్ నిబద్ధమై ఉంది’ అని మోడీ తెలియజేశారు. ప్రధాని మోడీ గత ఫిబ్రవరిలో తన రెండు రోజుల యుఎస్ పర్యటనలో ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఆయన తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూరెలతో కలసి మోడీని కలుసుకున్నారు. ఆ సమావేశంలో ప్రధాని మోడీకి మస్క్ ఒక స్టార్‌షిప్ షట్కోణ ఉష్ణకవచ రేకును కానుకగా ఇచ్చారు. రానున్న మాసాల్లో ముంబయి సమీపంలో ఒక రేవుకు కొన్ని వేల కార్లను నౌకారవాణా చేయడం ద్వారా భారతీయ విపణిలోకి ప్రవేశించేందుకు టెస్లా సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. బ్లూమ్‌బెర్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ముంబయి, ఢిల్లీ, బెంగళూరులలో తమ అమ్మకాలు ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :