ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : పెద్దపల్లి జిల్లా పౌర సరఫరాల విభాగం పరిధిలో గోదావరిఖని, రామగుండం మండలానికి చెందిన ఎఫ్పీ షాప్ డీలర్ వి. కిషన్ రెడ్డి దాఖలు చేసిన ఆరోపణల పిటిషన్పై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (సివిల్ సప్లైస్) డి. వేణు ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖని మారుతీనగర్కు చెందిన వి. కిషన్ రెడ్డి, షాప్ నెం. 3612041 డీలర్గా వ్యవహరిస్తూ, సంధుపట్ల భవానీ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ (షాప్ నెం. 3612052)పై పలు అంశాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 2025 అక్టోబర్ 10న జిల్లా అధికారులకు పిటిషన్ సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ పిటిషన్పై ప్రాథమిక పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం (సివిల్ సప్లైస్) నుంచి లెఫ్. నెం. CS3/168/2025, తేదీ 19-11-2025తో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం నియంత్రణ ఉత్తర్వులు–2016 నిబంధనల ప్రకారం సరసమైన ధరల దుకాణాల డీలర్లకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి నియామక అధికారిగా, క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సంబంధిత అంశాన్ని అన్ని కోణాల నుంచి సమగ్రంగా పరిశీలించి, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విచారణలో భాగంగా ఆరోపణల నిజానిజాలను నిర్ధారించి, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను వీలైనంత త్వరగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ఉత్తర్వుల ప్రతిని రామగుండం తహశీల్దార్కు సమాచారార్థం పంపించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం ద్వారా ఈ ఉత్తర్వులు ధృవీకరించబడ్డాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 18 ఐసీఓ పరిధిలోని ఎఫ్పీ షాప్లకు సంబంధించి పెద్దగా విమర్శలు లేకపోయినా, కేవలం ఒకే షాప్పై మాత్రమే వరుస ఆరోపణలు రావడం వెనుక అంతర్మేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో సదరు డీలర్ పొందిన సర్టిఫికెట్ అసలుదా, నకిలీదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఓపెన్ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా జారీ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఈ సర్టిఫికెట్ మూలాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎందుకు కొంతకాలంగా నిరంతరం ఫిర్యాదులు, విచారణలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని, వ్యవస్థలో ఏదో తేడా ఉందన్న భావన రామగుండం నియోజకవర్గ ప్రజల్లో బలపడుతోంది. రేషన్ డీలర్ వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న ఈ సమయంలో, అధికారులు నిర్వహించే విచారణ ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎఫ్పీ షాప్ల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల కట్టుబాటు ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తుండటంతో, ఈ వ్యవహారంపై వచ్చే తుది నివేదికే కీలకంగా మారనుందని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.
Admin
Aakanksha News