ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే యువకుడు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్తో పాటు మరో ఏజెంట్పై పది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అందుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే బాధితుల డబ్బుల రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు.తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకెళ్లి విచారణ అనంతరం తిరిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే కొద్ది సేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ మందుకు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల వేధింపుల వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంపత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Admin
Aakanksha News